వినాయకచవితి
వేద గణపతి వ్యాసంలో గణపతి నేపద్యం తెలుసుకోన్నాం. ఆ వ్యాసం ఎవరికీ సామాన్యంగా తెలియని వేదం లో ఉన్న గణపతి మూలాలని తెలుసు కొన్నాం.కాని ఇక్కడ అందరికి వినాయక వ్రతకల్పం లోని కథ చాలవరకు అందరికి తెలిసిందే దానిని వ్రాయటానికి కొత్త బ్లాగ్, దానిలో ఒక వ్యాసం అక్కరలేదు. కాబట్టి వినాయక వ్రతకల్పం లోని కొన్ని రహస్యాలను తెలుసుకొనే ప్రయత్నం చేద్దాం. కాని కథ లోని కొన్నిసందేహాలను వాటి కారణాలను తెలుసుకొందాం.
వినాయకవ్రతకల్పం స్కాంద పురాణం లోనిది. సామాన్యంగా వరలక్ష్మి , సత్యనారాయణ లాంటి వ్రతాలతో పోల్చి చూస్తే ఏదోకావాలంటే ఏంచేయాలి అని ఎవరో అడగటం, దానికి, ఇలా చేయాలి, ఇవి వండాలి, ఇది దానం చేయాలి, ఈ లాభాలు ఉంటై, అని చూస్తాం, కానీ వినాయక వ్రతకల్పంలో కేవలం కథ మాత్రమే ఉంటుంది. సరే ఈ కథ చదివినా , విన్నా నీలాపనిందలు రావని కూడా ఉంది. కథ చదివితేనే నీలాపనిందలు పోవటం కొంత విచిత్రం గానే ఉంది. కానీ కథను అర్ధం చేసుకొనే ప్రయత్నం చేస్తే నీలాపనిందలు పోవటం మాత్రం నిజం. కాబట్టి ఆ ప్రయత్నం చేద్దాం
వినాయక జననం :
ఎక్కువగా లేకుండా నాలుగు మాటల్లో గుర్తుతెచ్చుకొంధాం. మొదట గజాసురుడు శివుని గూర్చి తపస్సు చేసి తన గర్భం లో ఉండేలా చేసుకోవటం. పార్వతి శివుని కోసం విష్ణువుని ఆశ్రయించటం. విష్ణువు నందీశ్వరుని సహాయంతో గజాసురుని చంపించి శివుని తీసుకురావటం, శివునికోసం పార్వతి నలుగుస్నానం, నలుగు పిండి తో గణపతి ని చేసి ద్వారానికి కాపలాగా ఉంచటం, పిల్లడు శివుని అడ్డగించటం చేత శివుని చేతిలో మరణం. గజముఖం తో మళ్ళీ బతకటం.ఇంతటితో గణేశోత్పతి పూర్తయింది.
ఈ కథలో ఒక్కొక్క పాత్రను లోతుగా పరిశీలిద్దాం. మొదట పాత్ర పార్వతి. ఎందుకంటే నా అన్ని వ్యాసాలలో ఎక్కడో ఒకచోట ఉండే లలితా స్మరణం ఇక్కడ పార్వతిరూపం లో చేద్దాం. (పార్వతి పద్మనయనా పద్మరాగ సమప్రభా ). వినాయక జననానికి సంకల్పం అమ్మవారి వద్దనే మొదలైంది. ఈ కథలో అమ్మవారు కొన్ని చోట్ల విచిత్రంగా ప్రవర్తించింది.
1 . శివుని కాపాడటానికి విష్ణువు వద్దకు వెళ్ళింది. లలితా సహస్ర నామాలలో కరాంగుళి నఖోత్పన్న నారాయణ దశాకృతి: అనే నామం అమ్మవారి చేతి పది గోళ్ళు నుండి నారాయణుని దశావతారాలు ఉత్పన్నం అయ్యాయి అని చెప్తుంది . అంత శక్తీ ఉన్న అమ్మవారు నిష్ణువు ను ఎందుకు ఆశ్రయించింది ? . సరే పార్వతికి వినాయక కథ లో శక్తీ లేదు అనుకొందామంటే గణపతి శివుని చేతులో మరణించాడని తెలిసిన పార్వతి మహోగ్ర రూపానికి శివ, విష్ణువు తో కలిపి అందరు దేవతలు భయపడి పోయారు. అంతే కాక గణపతికి సహాయంగా ఉన్న పార్వతి అంశలు సమస్త రుద్ర గణాలను ఓడించాయి. ఎప్పుడైనా అమ్మవారు సర్వశక్తిమయీ.
2. అసలు ముందు, స్నానం చేస్తూ నలుగు పిండితో గణపతిని ఎందుకు చేయాలనిపించింది. సరే స్నానం చేసేటప్పుడు ఎవరు రాకుండా ఒకరు కావాలి అనుకున్నా, ఆవిడ చతు:షష్టి కోటి యోగిని గణ సేవిత. అరవై నాలుగు కోట్ల శక్తీ వంతులైన యోగిని దేవతలు ఉన్న ఆవిడకు చిన్న పిల్లాడి అవసరం ఏంటి?
ఈ సందేహాలను తీర్చు కోవడం అంటే జగన్మాత రహస్యంగా మానవులకు చెప్పిన కొన్ని నియమాలను తెలుసుకోవటం . మొదటి గృహిణి ఐన పార్వతి సామాన్య గృహిణులకు కొన్ని ధర్మాలను తెలిపింది. దీనితోపాటు అంతర్గతంగా ఇమిడి ఉన్నకొన్ని మానవ సంబందాలను, కుటుంబ వ్యహారాలు తెలుసుకొనటం వలన వినాయక వ్రత ఫలం పూర్తిగా మనకు దక్కుతుంది.
వేదగణపతి వ్యాసం లో గణపతిని విశ్వవ్యాప్తమైన ఒక శక్తీగా తెలుసుకోన్నాం అంతే కాకుండా వినాయకునికి మహాగణపతి కి గల తేడాను కూడా తెలుసుకోన్నాం. వినాయకునిపూజ కావచ్చు ఇంకా ఎ పూజ ఐన కావచ్చు మహాగణపతి పూజ తప్పనిసరిగా చేయాలనీ అది ఎలా చేయాలో కూడా ఆదికుటుంబిని (సదాశివ కుటుంబిని) ఐన పార్వతి వినాయక వ్రతకల్పం ద్వారా దిశా నిర్దేశం చేసింది. అది ఎలా అంటే వినాయక ఆవిర్భావినికి ముందు మహా గణపతిని పసుపు (ఆలయాలలో అమ్మవారి నలుగు పసుపుతోనే కదా ) చేసి ప్రాణ ప్రతిష్ట చేసింది. ఈ విధంగా పార్వతి మహాగణపతి పూజ ముందు తను చేసి తరువాత గణాధిపత్యం వినాయకునికి ఇవ్వడం ద్వారా వినాయకుని ప్రధమ పూజకు అర్హుడిని చేసింది. పార్వతి నలుగు పసుపు తో గణపతిని చేయటం ద్వారా, ఉద్వాసన చేసిన తర్వాత పసుపు గణపతిని ఏం చేయాలో కూడా అంతర్గతంగా మొదటి ఇల్లాలు ఐన పార్వతి గృహిణులకు సంకేతం ఇచ్చిందని అని నా ఆలోచన.
గణాధిపత్యం
గణాధిపత్యం
continued.........
- : నాంపల్లి రామకోటేశ్వర్
గండేపల్లి
Note: the red lettered words are from Lalitha sahasra nama strotram
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి