శ్రీ పాద స్మరణం
ఏ తల్లి పాద స్పర్శ మాత్రాన గజముఖుడు లోకానికి ప్రధమ పూజ్యుడైనాడో.
ఏ తల్లి పాద స్మరణ మాత్రాన షణ్ముఖుడు ప్రణవాత్మకుడైన పరమేశ్వరునికి ప్రణవార్ధాన్ని ఉపదేశించగలిగాడో ,
ఏ తల్లి మంజీర నాదాలను వేదాలగా గ్రహించి బ్రహ్మ సృష్టి చేస్తున్నాడో,
ఏ దేవి ఆరాధనా ఆధారంతో నారాయణుడు దశాకృతులతో అసురసంహారం చేస్తున్నాడో,
ఏ శక్తి పద ధ్యానలబ్ద శక్తితో రుద్రుడు లయకారకుడు అవుతున్నాడో,
ఏ దేవి పాదాలు నిత్యం పశుపతి జటాజూట జలాలతో అభిషేకించ బడతాయో,
ఏ దేవి పాద ధూళి వేద కాంతల సీమంత సింధూరంలా భాసిస్తుందో,
ఏ తల్లి చీర కుచ్చిళ్ళ అంచుల రాపిడితో సమస్త దేవతా మకుటాలు ప్రకాశిస్తాయో,
ఏ తల్లి పారాణి అరుణిమ తాపసులకు జ్ఞానారుణోదయమో,
ఏ కాలి మట్టెల ప్రకాశంతో సూర్య చంద్రులు భాసిస్తారో ,
ఏ దేవి పాద నఖ దీప్తి మానవుల తమోగుణ హరణమో,
అటువంటి ప్రణవాత్మక ప్రణయిని కమలనయన నయన కమలార్చిత పదకమలములను స్మరిస్తూ.........
-------- స్వస్తి ----------
- : నాంపల్లి రామకోటేశ్వర్
గండేపల్లి
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి